హైదరాబాద్: అంతరిక్షంలో వ్యర్ధాలు పెరిగిపోతున్నాయి. అవసరంలేని శాటిలైట్లు.. ఆకాశంలోనే ఉండిపోతున్నాయి. ఉపగ్రహాలకు సంబంధించిన పరికరాలు.. కాలం చెల్లిన శాటిలైట్లు ఢీకొనడం వల్ల ఏర్పడిన ముక్కలు.. అంతరిక్షంలో కుప్పలు కుప్పలుగా తయారవుతున్నాయి. ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు రెండు వేల ఉపగ్రహాలు భ్రమిస్తున్నాయి. మరో మూడు వేల నిర్జీవ ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ లెక్క ప్రతి ఏడాది ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు యురోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొన్నది.
కేవలం ఉపగ్రహాలే కాదు.. రాకెట్ల నుంచి కూడా వ్యర్ధాల ముక్కలు అంతరిక్షంలో ఉండిపోతున్నాయి. ఉదాహరణకు 12 ఏళ్ల మిషన్ కోసం ప్రయోగించిన ఓ శాటిలైట్.. తన కాలపరిమితి ముగిసిన తర్వాత అది వ్యర్థంగా మారుతోంది. కాని అది మరో వ్యర్థంతో ఢీకొట్టినప్పుడు.. వేల వేల ముక్కలు తయారవుతున్నాయి. ఇలా ఇప్పుడు అంతరిక్షంలో సుమారు 20 వేల భారీ వ్యర్థాల ముక్కలున్నాయి.
అంతరిక్ష వ్యర్థాలతో ప్రయోగాలకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ నిర్దేశిత కక్ష్యలో కనుక వ్యర్థం ఉండిపోతే, అప్పుడు మరో పరీక్షకు కష్టం ఎదురవుతుంది. మరో శాటిలైట్ను డామేజ్ చేయకుండా ఉండాలంటే.. కాలం ముగిసిన శాటిలైట్ పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఉపగ్రహాలు ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రతి ఏడాది స్పేస్ ఏజెన్సీలు రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా వ్యర్థాల నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకుంటోంది.